Saturday, December 22, 2012

అసలు గోంగూరంటే ఏంటో తెలుసా నీకు

దేవదానవులు అమృతంకోసం పాలసముద్రాన్ని మధిస్తున్న సమయంలో కడలిగర్భమునుండి ఉద్భవించిన వాటిల్లో “గోంగూర” ఒకటి. దాన్ని దేవేంద్రుడు తన నందనోద్యానవనములో నాటించటం, తరువాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అమరావతిని దర్శించినపుడు పారిజాతముతో పాటుగా ఈ గోంగూరమొక్కను కూడా పృధ్విమీదకు తీసుకురావటం, భారతయుద్ధంలో సహాయపడినందులకుగాను ఆంధ్రులకు గోంగూరను ప్రసాదించటం, అప్పటినుండి “ఆంధ్రమాత”గా పేరుప్రఖ్యాతులు పొందినవిషయం అందరికీతెలిసినదే. 


మహర్షులు భుద్దికుశలతను పెంపొందించే మార్గాని ప్రసాదించమని అమ్మవారిని ప్రార్దించినపుడు, గోంగూరను భుజియింపని చెప్పటంతో అప్పటినుండి శాకంబరీదేవీ ప్రసాదంగా కొలవటం యెరిగిన విషయమే. మొదట రుచులను పంచరుచులుగానే పేర్కొన్నారని, గోంగూర పులుపు నెరిగిన తరువాత షడ్రుచులుగా పేర్కొన్నారన్న విషయంకూడా అందరికీ ముదావహమే. గోంగూరలో ఎన్నో ఔషధగుణాలున్న విషయాన్ని మన పూర్వీకులు ఏనాడో నిర్ధారించారు. తులసిమాతతో పాటు స్త్రీలు సరిసమానంగా ఆదరించే మన ఆంధ్రమాత గోంగూర. రోజూ పూజానంతరం తులసి మొక్కతో పాటుగా ఆ చేత్తోనే ఇన్నినీళ్ళు ఆ గోగు మొక్కకు కూడా పోస్తే ఆ ఇంటిఇల్లాలికి దిగులేముంటుంది చెప్పండి. 

అర్ధరాత్రో,అపరాత్రో చెప్పా పెట్టకుండా ఊడిపడే అతిధులను ఆదుకొనేది గోంగూరే. అసలు ఆ మూల జాడీలో ఇంత గోంగూర వుందంటే ఆ ఇల్లాలికి కొండంత అండ. గోంగూర మహాపచ్చడి. పిల్లాడో, పిల్లో పైచదువులకు ఏదన్నా ఊరు వెళుతున్నారంటే కూడా పంపించేది గోంగూరనే. అక్కడ ఏమి దొరకకపోతే గోంగూరన్నా ఆదుకుంటుందిగదాయని. గోంగూర ఆపద్భాంధవి. మనవాళ్లు విదేశాలు వెళుతున్నారంటే తీసుకెళ్ళాల్సిన జాబితాలో అగ్రతాంబూలం గోంగూరదే. పార్వతీశం కూడా లండన్ వెళుతూ గుమ్మడికాయజాడీఅంత గోంగూర పట్టుకెళ్లాడని మొక్కపాటివారే స్వయంగా పేర్కొన్నారు. గోంగూర ఎంతోమందికి జీవనోపాధిని కలిగిస్తోంది. రైతుల విషయం పక్కన పెడితే, ఈనాడు ఊరూరావెలసిన స్వగృహావారు మొదట గోంగూరతోనే వారిఅమ్మకాలను ఆరంభించారన్న విషయం చాలామందికి తెలియదు. 

గోంగూరకు శుభాశుభాలు లేవు. ఇంట్లో శుభకార్యమైనా, అశుభకార్యమైనా ఆదుకొనేది గోంగూరే. ఏ శుభకార్యానికి వెళ్ళినా, ఏ భోజనశాలకు వెళ్ళినా మొదట కనిపించేది గోంగూరే. గోంగూర వుంటే ఎటువంటి కార్యక్రమమైనా సజావుగా సాగిపోతుంది. గోంగూరకు మిగతా పచ్చళ్లలాగా భేషజాలు లేవు. చద్దెన్నంలో ఇట్టే తన ప్రతిభని ప్రదర్శిస్తుంది . పిల్లలు పొద్దున్నే చదువులకు వెళ్లాలంటే చద్దెన్నానికి ఆధరువు గోంగూరే. ఆ కలయిక అమృతతుల్యం. పిల్లలకే చెల్లు ఆ ఆనందం. ఎవరు చూడకపోతే చద్దెన్నంలో గోంగూరను లాగించే పెద్దలు లేకపోలేదు. ఆ బాల్యసాన్నిహిత్యం అలాంటిది. ఇక అట్లతదియ వచ్చిందంటే ఆటలకు పోవాలంటే సూర్యోదయానికి పూర్వమే పిల్లలు చద్దెన్నం, గడ్డపెరుగు తోపాటు జోడించేది గోంగూరనే. 

గోంగూర స్వయంప్రతిపత్తి గలిగిన బ్రహ్మపదార్ధం. కందిపోడి, కమ్మనినెయ్యిలతో ఇట్టేకలిసిపోతుంది గాని తన ఉనికినిమటుకు పోగొట్టుకోదు. ఆ కలయిక వర్ణనాతీతం. దాన్ని స్తోత్రించటం కవులకే చెల్లు.  అసలు చద్దెన్నంలో గోంగూర కలుపుకొని ఉల్లిపాయ కొరికితే కలిగేరుచి ఎవరికివారు అనుభవించాలిగాని మాటలుచాలవు. 

గోంగూరపచ్చడి పెట్టటంకూడా ఒక కళ. అందరికీ అది అబ్బదు. మాబంధువొకాయన పెళ్లిసంభంధానికి వెళ్ళి పిల్లకు గోంగూరపచ్చడి చెయ్యటం చేతగాదని ఏకంగా చక్కనిపిల్లనే కాదుపొమ్మన్నాడు. ఒకావిడ కోడలుపిల్ల గోంగూరపచ్చడిచేస్తూ దాంట్లో చింతపండు కలిపిందని నానారాద్ధాంతం చేసింది. అలాకలపటం ప్రకృతివిరుద్ధమని, గోంగూరను అవమానించినట్లేనని తేల్చిపారేసింది.

బామ్మలకు, మామ్మలకు వర ప్రదాయిని గోంగూర. ఇంత పిండిఉడకేసుకొని దాంట్లో గోంగూర కలుపుకుంటే జీవితాలే వెళ్లదీయవచ్చు. గోంగూర నిలవపచ్చడి. మిగతా పచ్చళ్లలాగా అర్భకురాలుగాదు. ఏడాదిపాటునా నిల్వచేసినా తన స్వయంప్రకాశత్వానిగోల్పోదు. బూజు, చీడపీడలు లాంటివి గోంగూర దరిచేరలేవు. పానుగంటివారి ఝంఘాలశాస్త్రిగారికి అంత ప్రతిభాకౌశల్యం గోంగూర నిత్యము భుజించటంవల్ల కలిగినదని వారేపేర్కొన్నారు. గోంగూరకు ఆయుర్వేదంలో అగ్రతాంబూలం ఇచ్చారు. పైత్యం, దగ్గు, జలుబులకు మహత్తరమైనమందని ప్రస్తుతించారు. పిల్లకు భుద్దిపెరగాలంటే నిత్యం రెండోముద్దలో ఉసిరికాయంత గోంగూరను మించింది లేదు.

ఈమధ్య గోగుపువ్వులతోచేసిన పచ్చడి రుచిచూడమంటూ ఇచ్చారు. ఆ మర్నాడు సంతలో గోగుపువ్వులను కుప్పలుగాపెట్టి అమ్మటంచూశాను. ముందు తరాలకు మనం గోంగూర అందించాలంటే దానికి కారణభూతమైన గోగుపువ్వులను కూడా వదలకుండా భుజిస్తున్నారే అని బాధకలిగింది. కరుణశ్రీ పాపయ్య శాస్త్రిగారే వుండిఉంటే గోగువిలాపమంటూ మళ్ళీ విలపింప చేసేవారు గదా అనిపించింది. గోంగూరతినని తెలుగువాడే లేడంటే అతిశయోక్తికాదేమో.

 

1 comment: