Monday, December 31, 2012

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన ఎంకి పాట

నండూరి సుబ్బారావు గారి “ఆటపాటలలోనె మరచినావా, రాజ” ఎంకి పాటను శ్రీరంగం గోపాలరత్నం గారు లాలిత్యాన్ని ఒలకపోస్తూ ఎంత అధ్బుతంగా పాడారో విని చూడండి. 

Saturday, December 29, 2012

భాగ్యలక్ష్మి సినిమాలోని పసందైన రెండు పాటలు

1943లో వచ్చిన నాగయ్య గారి సినిమా భాగ్యలక్ష్మిలో కధకు సంబంధం లేకుండా ప్రేక్షకులకు హాస్యాన్ని కలిగించటానికా అన్నట్లుగా తమిళ జంట ఎన్. ఎస్. కృష్ణన్ మరియు టి. ఎ. మధురం గార్లు పండించిన హాస్యం చాలా బావుంటుంది. వారితో రెండు పాటలు వున్నాయి. మొదటిపాటలో భార్యాభర్తల సంవాదం తరువాయి పాటలో సఖ్యత కనబడతాయి. అప్పటికే విడుదలైన సినిమాలలోని పాటలను తీసుకొని రాసిన ఒక పేరడి రెండవ పాటలో కనిపిస్తుంది.

ఈ పేరడీ పాటకు మాతృకలు, “నేనే రాణి నైతే” కన్నాంబ గారు పాడినది చండిక సినిమాలో, “మగవారినిల నమ్మరాదే చెలీ” అంటూ బెజవాడ రాజరత్నం గారు దేవత సినిమాలో పాడినది, అదే సినిమాలో “రావే రావే బంగారుపాప” అంటూ నాగయ్యగారు పాడినది, మాలతి గారు పాడిన సుమంగళి సినిమాలోని “వస్తాడే మాబావ”, 







Friday, December 28, 2012

మీఱజాలగలడా నాయానతి – స్థానం వారు

పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు స్వయాన రచియించి, గానం చేసిన “మీఱజాలగలడా నాయానతి” ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. 

Thursday, December 27, 2012

ఎంకి పాట – బాలమురళీకృష్ణ గారి గళంలో

“నాయాస రగిలింప సాయముగ - యెంకి” నండూరి సుబ్బారావు గారి ఎంకి పాట స్వతంత్ర జనవరి 1949 సంచికలో ప్రచురితమైనది 
 





Wednesday, December 26, 2012

మార్జాలోపాఖ్యానము అనబడే పిల్లి స్తుతి కదంబము

అల్లన తక్కుచు, తారుచు,
మెల్లన మ్యా వనుచు నను సమీపించుటకున్
చెల్లునె యెవ్వరికిని? నా
ఇల్లాలికి నీకు తప్ప ఇలలో? పిల్లీ ;


 అన్నారు బోయి భీమ కవి గారు.

బాల కృష్ణుడు వెన్నను దొంగిలించటం మొదట పిల్లిని చూసే నేర్చుకున్నాడని విజ్ఞులైన వాళ్లెవరైనా ఒప్పుకుంటారు. చప్పుడు చేయకుండా ఉట్టిని గట్టిన వెన్నను మాయం చెయ్యటం గోపాలుడి తరము గాక మరెవరితరము. బాల కృష్ణుడు చేస్తే భజించుదురుగాని పిల్లి గారు చేస్తే దండించుదురా. ఏమి వైచిత్రి.

ఏకాగ్రత విషయాన్నే తీసుకోండి, పిల్లి ఎంత ఏకాగ్రతను కనబరుస్తుంది. మహర్షులకు ఖఠోర మైన తపస్సు ఎలా చెయ్యాలి అనే సూక్ష్మ రహస్యాన్ని ఎవరు భోదించారు అనుకున్నారు. మన మార్జాలం గారే. ఎవరు వచ్చినా గాని కదలక, మరలక మనం అనుకున్న దానిమీదే దృష్టి నిలపాలి అనే సత్యాన్ని పిల్లి నేర్పించింది.

పిల్లలు  పిల్లి నుంచే గదా ఏడవటం నేర్చుకుంది. అసలు పిల్లులు ఏడుస్తుంటే పిల్లలు ఏడుస్తున్నారేమో అని తల్లడిల్లే తల్లులున్నారు. పిల్లలు ఎడిస్తే సముదాయిస్తారా, పిల్లులు ఎడిస్తేనేమన్నా కసురుకుంటారా. ఎంతటి భిన్న మనస్కుడు మానవుడు. పిల్లలు గారాము, మారాము కూడా పిల్లి నుంచే గ్రహించారు. పిల్లులు చూడండి ఎంత గారాము చేస్తూ మనలను రాసుకుంటూ పూసుకుంటూ మనచుట్టూ తిరుగుతూ మనం పెరుగన్నం తింటుంటే దాంట్లో సగం కొట్టేస్తాయో. పిల్లలు గూడా అల్లాగే మారాము చేసే వాళ్ళ కోర్కెలు నెరవేర్చు కుంటారు. అయినా పి”ల్ల”లు కంటే పి”ల్లు”లు ఎక్కువయినవని, ఎందుకంటే వాటికి ఒక కొమ్ము అధికమని పుచ్చా పూర్ణానందం గారు చమత్కరించారు.

న్యాయశాస్త్రాన్ని పిల్లుల నుండే మనం అభ్యసించాము. రెండు కోతుల మధ్య రొట్టె పంపకం ఎంత న్యాయ సమ్మతంగా ప్రదర్శించింది. ఈ రోజుల్లో ఆస్తి పంపకాల విషయమై ఏ పెద్దమనిషినన్నా సంప్రదిస్తే ఇద్దరికీ కాకుండా చేసి వారు చూపిస్తున్నది మార్జాల న్యాయమేగదా.

పిల్లల భద్రత విషయానికి వస్తే పిల్లి తొమ్మిదిళ్ళు పిల్లలను తిప్పుతుందని చులకనగా చూస్తాముగాని, ఆదిమానవులు కూడా తమ పిల్లలను అడవి జంతువుల బారి నుండి కాపాడుకోవట మెలాగో పిల్లిని చూసి గ్రహించి పని గట్టుకొని మరీ తొమ్మిది గుహలూ త్రిప్పేవారుట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అప్పులుచేసి ఎగొట్టేవారు తమ పిల్లలతో తొమ్మిది అద్దె కొంపలు మారితే మటుకు ఫరవాలేదు.

యోగులు యోగ విద్యా రహస్యాన్ని పిల్లిని చూసి వ్రాశారు. పిల్లిని చూడండి అరమోడ్పు కన్నులతో చుట్టూ జరిగేదానిని గ్రహిస్తున్నా కానీ గ్రహించనట్లుగా ధ్యానంలో నిమగ్నమై వుంటుంది. యోగా అంటే మనస్సును నిలకడ చేయటం అన్న విషయానిని మర్చిపోయి వెర్రి మొర్రి ఆసనాలు వేయటం పరిపాటి అయిపోయింది. మనం కూడా మార్జాలం మాదిరిగా ఆ మాత్రం ధ్యానంలో నిలకడ ప్రదర్శిస్తే ఎప్పుడో యోగిపుంగవుల మయి వుండే వాళ్ళము.

ఆ మాటకొస్తే మన పూర్వీకులు వేదాంత సారాన్ని మార్జాలంనుండి సంగ్రహించారు. ఎలుకల్లాగా, చీమల్లాగా పిల్లులు ఆహారాన్ని కలుగుల్లోను, బొరియల్లోనూ దాచుకోవు. ఏది వెంట రాదని, ఏది శాశ్వతం కాదని, వర్తమానంలో జీవించమని పిల్లులు పని గట్టుకొని భోదిస్తుంటే, అది కాదని ఆశాశ్వతమైన భోగాలకోసం మనం వెంపర్లాడుతున్నాము.

ఎంత ఎత్తు మీద నుంచి కింద పడినా గాని దెబ్బ తగలకుండా భూమికి దిగటం ఎలా అన్న నగ్న సత్యాన్ని శాస్త్రజ్ఞులు పిల్లిని చూసి అవగతం చేసుకున్నారు. దేహాన్ని తేలిక చేసుకోవటం ఎలాగో పిల్లి బోధిస్తోంది. ఈ పరిజ్ఞానాన్నే మనవాళ్లు అంతరిక్ష పరిశోధనలలో వాడుకుంటూ ఆహా ఓహో అని జబ్బలు చరుచుకుంటున్నారు.

పిల్లి ఎంతో ముందు చూపుగల జంతువు. తన ఉనికిని కాపాడుగోటానికి పెద్దపులి మావయ్యకు అన్నీ నేర్పించి తాను మటుకు చెట్టెక్కి కూర్చుంది. పెద్దపులి మొన్న మొన్నటి దాకా గూడా ప్రయతిస్తునే వుంది. ఆ మాత్రం ముందు చూపు మనకు లేక అన్నివిషయాలు అందరికీ వెలిబుచ్చి అభాసుపాలవుతున్నాము.

గోడమీది పిల్లివాటం అని అవహేళన చేస్తాము కానీ మన రాజకీయ నాయకులు పిల్లిని చూసి కాదుటండీ ఇన్ని పిల్లి మొగ్గలు వేయటం నేర్చుకుంది.

కర్మ సిద్ధాంతం మన నుదుటన రాసి వుంటే, అదికాదని పిల్లి ఎదురొచ్చిందని అభం శుభం తెలియని పిల్లి మీద అపనిందలు మోపటం, అభాండాలు వేయటం ఎంత శోచనీయం.

ఆహా ఓహో ఏమి నడకండి అంటూ మన లాలనామణులను చూసి మెచ్చుకుంటాము. ఈ పిల్లి నడకలు ఎవరినిచూసి నేర్చుకున్నారంటే మాట్లాడరెం. ఇంకెవరి నుండి పిల్లి నుండి గాక. పిల్లి నడకలో ఎంత సోయగముంది.

పిల్లి కళ్ళు అంటూ చులకనగా చూస్తారు గాని, పిల్లి లాగా చీకటిలో చూడగలరా మీరు. పిల్లి కళ్ళు వున్న వాళ్ళు ఆమాటకొస్తే చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. చీకటిలోకి చూడటం అంటే నీ లోపలికి నీవు చూసుకుంటూ అజ్ఞానపు పొరలు తొలగించుకోవటమన్న బ్రహ్మ సూక్ష్మం. పిల్లి చీకటిలో ఎలా చూడ గలుగు తొందా అని ఆలోచించి, చించి ఈ నాటికి మనవాళ్లు చీకటిలో చూడగలిగే పరికరాలను కనుగొన్నారు.

అసలు శుచి, శుభ్రత పిల్లులను చూసి గమనించాలి. పిల్లి ఎప్పుడూ కడిగిన ముత్యంలా వుంటుంది. మిగిలిన జంతువుల్లాగా అసభ్యంగా ఎప్పుడన్నా పిల్లిని చూశామా మనం. ఆ మాట కొస్తే మనలో చాలా మంది పిల్లి పాటించినంత శుభ్రత కూడా పాటించరు.

మనం నిత్యం కొలిచే దేవుళ్ళు పిల్లికి తగని అన్యాయం చేశారు. ఎందుకూ కొరగాని జంతువులను, పక్షులను వాహనాలుగా ఎంచుకున్నారు. పేరు పేరునా ఎందుకుగాని పిల్లి అంటేనే భయపడే అర్భకపు మూషికం మన బొజ్జ గణపయ్యకు వాహనామా. పిల్లి ఏం తక్కువ చేసిందని. 

పిల్లికి ఒకసారి కోపం వచ్చి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఘోర తపస్సంటే మన లాగా అనుకున్నారా, అసలే పిల్లాయే, అయిదు ఘడియల్లో బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే మానవుల నుండి తనకు రక్షణ కావాలని కోరింది. బ్రహ్మగారు ముందుచూపుతో, నిన్ను సంహరించినవారు నీఅంత బంగారపు పిల్లిని దాన మొసంగినగాని ఆపాపానికి పరిహారం లేదని చెప్పేసి అంతర్దానమయ్యారు. ఇది జరిగిచచ్చే విషయం కాదని మానవులు పిల్లిని వదిలి ఎలుకల మీద పడ్డారు. చూశారా మరి పిల్లి తెలివితేటలు. తన జాతి మనుగడను దృష్టిలోపెట్టుకొని వరం కోరింది. మనం అయితే స్వలాభం కోసం చూసుకుంటాము.

వెయ్యి మాటలేల అన్నిటా పిల్లియే మనకు ఆదర్శం, మార్గదర్శి, జీవన్ముక్తికి సోపానం.

 ఫ్రేరణ: హాస్యానికి నిర్వచనం చెప్పిన మునిమాణిక్యం వారి “మన హాస్యము” మరియు పుచ్చా పూర్ణానందం గారి “మీసాల సొగసులు”. 

పిల్లి మీద పుచ్చా పూర్ణానందం గారు వ్రాసి రేడియో కోసం చదివిన హాస్యప్రసంగ వ్యాసం “పిల్లి ఎదురొచ్చింది”. ఆసక్తి వున్నవారు ఈ క్రింద వున్న లంకె మీద నొక్కి అక్కడ “ఆకాశవాణి – ఇతర” అన్న గదిలోకి వెళితే మీకు పిల్లి ఎదురొస్తుంది. 
http://www.maganti.org/ 

Monday, December 24, 2012

అమరావతీ పట్టణమున - సూర్యకుమారి

డాక్టర్ ద్రోణవల్లి రామమోహనరావు గారి ఆధ్వర్యములో వచ్చిన అపూర్వ సంకలనం “దేశ భాషలందు తెలుగు లెస్స” లో ప్రచురించిన రాయప్రోలు సుబ్బారావు గారి “అమరావతీ పట్టణమున” అనే పాట సాహిత్యాన్ని, టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన ఈ పాటను పోస్ట్ చేస్తున్నాను. ఈ పాటకు ఆడియో సహకారం surasA.net. తెలుగు మహాసభల నేపధ్యంలో ఒకసారి మన తెలుగు వెలుగులను జ్నప్తికి తెచ్చుకున్నట్లవుతుందని. 
 













Sunday, December 23, 2012

సినిమాలో ఒక పాట – రికార్డులో ఇంకో పాట

1943లో వచ్చిన నాగయ్య గారి సంగీత ప్రధానమైన పాటల సినిమా భాగ్యలక్ష్మి. ఇందులో “వలచీ వచ్చీ” అనే పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి నవరాగమాలికా వర్ణం భీమవరపు నరసింహారావు గారి సంగీతంలో కానవస్తుంది. ఇది బృందగానం. టంగుటూరి సూర్యకుమారి గారితో పాటు ఇతరులు, నాగయ్య గారు కొద్దిగా గొంతు కలుపుతారు. ఈ పాట చివరిలో కొంచెంసేపు జలతరంగిణి మీద వినవచ్చే సంగీతం వీనుల విందుగా వుంటుంది. వాయిస్తున్నప్పుడే రికార్డు చేశారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఆ పాటను కింద చూడండి. ఈ పాటలో సూర్యకుమారి గారు టై కట్టుకొని కనబడతారు. ఆడవాళ్ళు టై కట్టుకోవటం అందునా ఆ కాలంలో అరుదైన విషయం.  

                      పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్




ఇదివరలో LP రికార్డ్స్  కోసమని ఆ పాటలను మళ్ళీ పాడించేవారని అంటారు. 1948లో వచ్చిన బాలరాజు సినిమాలో చెలియా కానరావా అనే పాటను సినిమాలో  అక్కినేని నాగేశ్వర రావు గారు, రికార్డ్ కోసమని ఘంటసాల గారు పాడారని,  నాగేశ్వరరావు గారు చెప్పారని  రంగారావు గారు పేర్కొన్నారు. 1986లో వి. ఎ. కె. రంగారావు గారి నేతృత్వంలో వచ్చిన అలనాటి అందాలు లో పైన కనువిందుచేసిన ఈ పాట ఒక్క సూర్యకుమారి గారి గళంలోనే కింద వినవస్తుంది.   అధ్బుతమైన, సంగీతప్రధానమైన పాట. ఈ పాటకు ఆడియో సహకారం oldtelugusongs.com


రజని గారి పాట సూర్యకుమారి గారి గళంలో

తెలుగు స్వతంత్ర (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో) నవంబర్ 1956 సంచికలో ప్రచురించిన రజని గారి “ముక్కోటి కంఠాలు” అనే పాట సాహిత్యాన్ని, టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన ఈ పాటను పోస్ట్ చేస్తున్నాను. ఈ పాటకు ఆడియో సహకారం surasA.net

 


















Saturday, December 22, 2012

అసలు గోంగూరంటే ఏంటో తెలుసా నీకు

దేవదానవులు అమృతంకోసం పాలసముద్రాన్ని మధిస్తున్న సమయంలో కడలిగర్భమునుండి ఉద్భవించిన వాటిల్లో “గోంగూర” ఒకటి. దాన్ని దేవేంద్రుడు తన నందనోద్యానవనములో నాటించటం, తరువాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అమరావతిని దర్శించినపుడు పారిజాతముతో పాటుగా ఈ గోంగూరమొక్కను కూడా పృధ్విమీదకు తీసుకురావటం, భారతయుద్ధంలో సహాయపడినందులకుగాను ఆంధ్రులకు గోంగూరను ప్రసాదించటం, అప్పటినుండి “ఆంధ్రమాత”గా పేరుప్రఖ్యాతులు పొందినవిషయం అందరికీతెలిసినదే. 


మహర్షులు భుద్దికుశలతను పెంపొందించే మార్గాని ప్రసాదించమని అమ్మవారిని ప్రార్దించినపుడు, గోంగూరను భుజియింపని చెప్పటంతో అప్పటినుండి శాకంబరీదేవీ ప్రసాదంగా కొలవటం యెరిగిన విషయమే. మొదట రుచులను పంచరుచులుగానే పేర్కొన్నారని, గోంగూర పులుపు నెరిగిన తరువాత షడ్రుచులుగా పేర్కొన్నారన్న విషయంకూడా అందరికీ ముదావహమే. గోంగూరలో ఎన్నో ఔషధగుణాలున్న విషయాన్ని మన పూర్వీకులు ఏనాడో నిర్ధారించారు. తులసిమాతతో పాటు స్త్రీలు సరిసమానంగా ఆదరించే మన ఆంధ్రమాత గోంగూర. రోజూ పూజానంతరం తులసి మొక్కతో పాటుగా ఆ చేత్తోనే ఇన్నినీళ్ళు ఆ గోగు మొక్కకు కూడా పోస్తే ఆ ఇంటిఇల్లాలికి దిగులేముంటుంది చెప్పండి. 

అర్ధరాత్రో,అపరాత్రో చెప్పా పెట్టకుండా ఊడిపడే అతిధులను ఆదుకొనేది గోంగూరే. అసలు ఆ మూల జాడీలో ఇంత గోంగూర వుందంటే ఆ ఇల్లాలికి కొండంత అండ. గోంగూర మహాపచ్చడి. పిల్లాడో, పిల్లో పైచదువులకు ఏదన్నా ఊరు వెళుతున్నారంటే కూడా పంపించేది గోంగూరనే. అక్కడ ఏమి దొరకకపోతే గోంగూరన్నా ఆదుకుంటుందిగదాయని. గోంగూర ఆపద్భాంధవి. మనవాళ్లు విదేశాలు వెళుతున్నారంటే తీసుకెళ్ళాల్సిన జాబితాలో అగ్రతాంబూలం గోంగూరదే. పార్వతీశం కూడా లండన్ వెళుతూ గుమ్మడికాయజాడీఅంత గోంగూర పట్టుకెళ్లాడని మొక్కపాటివారే స్వయంగా పేర్కొన్నారు. గోంగూర ఎంతోమందికి జీవనోపాధిని కలిగిస్తోంది. రైతుల విషయం పక్కన పెడితే, ఈనాడు ఊరూరావెలసిన స్వగృహావారు మొదట గోంగూరతోనే వారిఅమ్మకాలను ఆరంభించారన్న విషయం చాలామందికి తెలియదు. 

గోంగూరకు శుభాశుభాలు లేవు. ఇంట్లో శుభకార్యమైనా, అశుభకార్యమైనా ఆదుకొనేది గోంగూరే. ఏ శుభకార్యానికి వెళ్ళినా, ఏ భోజనశాలకు వెళ్ళినా మొదట కనిపించేది గోంగూరే. గోంగూర వుంటే ఎటువంటి కార్యక్రమమైనా సజావుగా సాగిపోతుంది. గోంగూరకు మిగతా పచ్చళ్లలాగా భేషజాలు లేవు. చద్దెన్నంలో ఇట్టే తన ప్రతిభని ప్రదర్శిస్తుంది . పిల్లలు పొద్దున్నే చదువులకు వెళ్లాలంటే చద్దెన్నానికి ఆధరువు గోంగూరే. ఆ కలయిక అమృతతుల్యం. పిల్లలకే చెల్లు ఆ ఆనందం. ఎవరు చూడకపోతే చద్దెన్నంలో గోంగూరను లాగించే పెద్దలు లేకపోలేదు. ఆ బాల్యసాన్నిహిత్యం అలాంటిది. ఇక అట్లతదియ వచ్చిందంటే ఆటలకు పోవాలంటే సూర్యోదయానికి పూర్వమే పిల్లలు చద్దెన్నం, గడ్డపెరుగు తోపాటు జోడించేది గోంగూరనే. 

గోంగూర స్వయంప్రతిపత్తి గలిగిన బ్రహ్మపదార్ధం. కందిపోడి, కమ్మనినెయ్యిలతో ఇట్టేకలిసిపోతుంది గాని తన ఉనికినిమటుకు పోగొట్టుకోదు. ఆ కలయిక వర్ణనాతీతం. దాన్ని స్తోత్రించటం కవులకే చెల్లు.  అసలు చద్దెన్నంలో గోంగూర కలుపుకొని ఉల్లిపాయ కొరికితే కలిగేరుచి ఎవరికివారు అనుభవించాలిగాని మాటలుచాలవు. 

గోంగూరపచ్చడి పెట్టటంకూడా ఒక కళ. అందరికీ అది అబ్బదు. మాబంధువొకాయన పెళ్లిసంభంధానికి వెళ్ళి పిల్లకు గోంగూరపచ్చడి చెయ్యటం చేతగాదని ఏకంగా చక్కనిపిల్లనే కాదుపొమ్మన్నాడు. ఒకావిడ కోడలుపిల్ల గోంగూరపచ్చడిచేస్తూ దాంట్లో చింతపండు కలిపిందని నానారాద్ధాంతం చేసింది. అలాకలపటం ప్రకృతివిరుద్ధమని, గోంగూరను అవమానించినట్లేనని తేల్చిపారేసింది.

బామ్మలకు, మామ్మలకు వర ప్రదాయిని గోంగూర. ఇంత పిండిఉడకేసుకొని దాంట్లో గోంగూర కలుపుకుంటే జీవితాలే వెళ్లదీయవచ్చు. గోంగూర నిలవపచ్చడి. మిగతా పచ్చళ్లలాగా అర్భకురాలుగాదు. ఏడాదిపాటునా నిల్వచేసినా తన స్వయంప్రకాశత్వానిగోల్పోదు. బూజు, చీడపీడలు లాంటివి గోంగూర దరిచేరలేవు. పానుగంటివారి ఝంఘాలశాస్త్రిగారికి అంత ప్రతిభాకౌశల్యం గోంగూర నిత్యము భుజించటంవల్ల కలిగినదని వారేపేర్కొన్నారు. గోంగూరకు ఆయుర్వేదంలో అగ్రతాంబూలం ఇచ్చారు. పైత్యం, దగ్గు, జలుబులకు మహత్తరమైనమందని ప్రస్తుతించారు. పిల్లకు భుద్దిపెరగాలంటే నిత్యం రెండోముద్దలో ఉసిరికాయంత గోంగూరను మించింది లేదు.

ఈమధ్య గోగుపువ్వులతోచేసిన పచ్చడి రుచిచూడమంటూ ఇచ్చారు. ఆ మర్నాడు సంతలో గోగుపువ్వులను కుప్పలుగాపెట్టి అమ్మటంచూశాను. ముందు తరాలకు మనం గోంగూర అందించాలంటే దానికి కారణభూతమైన గోగుపువ్వులను కూడా వదలకుండా భుజిస్తున్నారే అని బాధకలిగింది. కరుణశ్రీ పాపయ్య శాస్త్రిగారే వుండిఉంటే గోగువిలాపమంటూ మళ్ళీ విలపింప చేసేవారు గదా అనిపించింది. గోంగూరతినని తెలుగువాడే లేడంటే అతిశయోక్తికాదేమో.

 

Wednesday, December 19, 2012

ఎమ్. ఎస్. రామారావు గారు పాడిన లలిత గేయం


ఆకాశవాణి వారు ప్రసారం చేసిన ఎం. ఎస్. రామారావు గారు పాడిన లలిత గేయాలు ఇంతకు ముందు రెండు పోస్ట్ చేశాను. ఇది మూడో లలిత గేయం “లేవమ్మా కమలా లేవమ్మ నిదుర లేవమ్మ నిదుర” 




Sunday, December 16, 2012

ఆకాశవాణి - భక్తిరంజని గీతం

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు భక్తి రంజని కార్యక్రమంలో గతంలో ప్రసారం చేసిన “పాలయమాం రమాపతే హరే” అనే భక్తి గీతం వినండి
 

Saturday, December 15, 2012

అలనాటి గ్రాంఫోన్ పాటలు

ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారు అలనాటి గ్రాంఫోన్ పాటలను  LP లుగా ఉన్న వాటిని CD లుగా రూపాంతరం చేసి పట్టుకు వచ్చారు. రెండేళ్ల క్రితం విడుదల చేసిన మొదటి భాగంలో ఇరవై మంది గాయనీ, గాయకులకు చెందిన 35 పాటలు, పద్యాలు మరియు రెణ్ణెల్ల క్రితం వచ్చిన రెండవ భాగంలో 25 మంది గాయనీ, గాయకులకు చెందిన ఏకంగా 58 పాటలు, పద్యాలను CDల రూపంలోను, ఆ గాయనీ, గాయకులకు చెందిన ఫోటోలు, ఇతర వివరాలు పుస్తక రూపంలోను పొందుపరచారు . అయితే ఆ పాటల సాహిత్యం మటుకు పొందుపఱచలేదు.





ముందు పాలలో వి. ఎ. కె. రంగా రావు గారి జనరంజని కార్యక్రమం రెండవ భాగంలో ఆయన ప్రస్తావించి వినిపించకుండా వదిలేసిన వల్లూరి జగన్నాధరావు గారి కొయ్యోడి పాట పైన చెప్పిన  CDలలో ఉన్నది సగం వరకు, ఆయన కొద్దిగా రుచి చూపించి ఆపేసిన ఇంకో కొయ్యోడి పాను పూర్తిగాను విందురుగాని. ఈ పాట పాడే నాటికి జగన్నాధరావు గారి గొంతుతో గొంతు కలిపిన,  అవసరాల (వింజమూరి) అనసూయ గారికి తొమ్మిదేళ్లని రంగారావు గారు రాసుకొచ్చారు. ఆ లెక్కన ఇది రమారమి 83 ఏళ్ల కిందటి  పాట. ఆ కొయ్యోడి పాట సాహిత్యాన్ని కూడా కింద ప్రచురించాను.  ఈ పాట సాహిత్యానికి మూలం రంగారావు గారి మరో ఆలాపన. ముందుగా రంగారావు గారి మాటలు ఆ తదుపరి కొయ్యోడి పాటలు




ఓ చుక్కల కోగట్టూకోని      చుట్టూ గోటూ రైకా తొడిగి
బుఱ్ఱా నున్నగ దువ్వూకోని   బొట్టూ కాటుక బెట్టూకోని
నోటిలో సుట్టా బెట్టూకోని       గోటుగా నే నడుసూకుంటా
సక్కానమే సూసూకుంటా   ఎక్కడి కెళ్తవు చిట్టెమ్మంటే 

పోలేరమ్మ మెరక మీకి    పుల్లల కెల్తను కొయ్యోడో
య్యో కొయ్యోనే పుల్లల కెల్తను కొయ్యోడో య్యో కొయ్యో
కర్రా చేతా గట్టూకోని         కిర్రూ చెప్పులు తోడుగూకోని
పాయల మొల్తాడేసుకోని   కాయా పంచెలు గట్టూకోని
క్కలాకు లేసుకోని        టెక్కుగా సరుకేసుకోని
ఎక్కడి కెళ్తవు కొయ్యోడంటే

పోలేరమ్మ మెరకల మీదికి పొగాకు కెల్తను చిట్టెమ్మీ లమ్మీ చిట్టెమ్మీ
మన మిద్దర మొక్కడ కెల్దామే మ్మీ చిట్టెమ్మీ

చీటికి మాటికి చిట్టెమ్మంటే   చీటికి మాటికి చిట్టెమ్మంటే
చీపురు దెబ్బలు తింటవురో రయ్యో కొయ్యోడా
నీవు చీపురు దెబ్బలు తింటవురో రయ్యో కొయ్యోడా

Friday, December 14, 2012

శ్రీశ్రీ గారి పాట సూర్యకుమారి గారి గళంలో

ప్రెస్ అకాడమీ వారి తెలుగు స్వతంత్ర ఆగష్టు 1948 సంచికలో ప్రచురించిన శ్రీశ్రీ గారి “ఓ మహాత్మా, ఓ మహర్షీ” అనే పాట సాహిత్యాన్ని, టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన ఈ పాటను పోస్ట్ చేస్తున్నాను. ఈ పాటకు ఆడియో సహకారం surasA.net 

Thursday, December 13, 2012

రాయప్రోలు సుబ్బారావు గారి పాట సూర్యకుమారి గారి గళంలో

ప్రెస్ అకాడమీ వారి తెలుగు స్వతంత్ర సెప్టెంబర్ 1948 సంచికలో పుష్పాంజలి శీర్షికన ప్రచురించిన rayaprolu subbarao రాయప్రోలు సుబ్బారావు గారి "ettavoyi nee jaya janda" “ఎత్తవోయి నీ జయ జెండా విప్పవోయి నీ ప్రియకాండా” అనే పాట సాహిత్యాన్ని, tanguturi suryakumari టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన ఈ పాటను పోస్ట్ చేస్తున్నాను. ఈ పాటకు ఆడియో సహకారం surasA.net. 

 











పిచ్చిక – కిచ కిచ, కిచ కిచ

ఈ మధ్య హైదరాబాదులో బయో డైవర్సిటీ మీటింగు సంధర్భంగా పెద్ద పెద్ద హొర్డింగ్స్ పెట్టారు మీ నాన్న చిన్ననాటి స్నేహితుడైన పిచ్చిక కనిపించటం లేదని. నిజమే మరి ఎందుకో గాని ఈ మధ్య ఉళ్ళల్లో కూడా అట్టే కనిపించటం లేదు. చిన్నప్పుడు కొత్త వరి పంట ఇంటికి తెచ్చేముందు వరి కంకులను ఇంటి ముంగిట్లో కడితే పిచ్చికల సందడే సందడి కిచ కిచ మంటూ పిల్లల్లాగా. ఒక పిచ్చుక రావటం ఒక వడ్ల గింజ ఎత్తుకుపోవటం, ఇంకో పిచ్చుక రావటం ఇంకో వడ్ల గింజ ఎత్తుకుపోవటం, ఈ విధంగా ఆ పిచ్చుకలను చూస్తూ పిల్లలకు, పెద్దలకు ఒకటే ఆనందం



ఈ మధ్య ప్రెస్ అకాడమీ వారి పాత పుస్తకాలు తిరగేస్తుంటే ఆంధ్ర పత్రిక వారి ఫిబ్రవరి 1938 భారతి సంచికలో పిచిక దంపతులు శీర్షిక మాటున చిలుకూరి లక్ష్మీనరసమ్మ గారు రచించిన ఒక చిన్న పా ఒకటి కనబడింది. దాన్ని కింద పోస్ట్ చేస్తున్నాను. దీన్ని ఒక పాలాగా గబ గబా, దబ దబా, లొడ లొడా చదువుతుంటే మళ్ళీ మనకు ఆ చిన్ననాటి పిచ్చికలు జ్నాపకం రావాల్సిందే మరి. పిచ్చుకలు అని అనేవాళ్ళు కూడా లేక పోలేదు మరి, కిచ కిచ మంటానికి పిచ్చికయితేనేమి, పిచ్చుకయితేనేమి